Thursday, July 2, 2009

అనవసర విషయాసక్తి

మనలో చాలామందికి యితరుల వ్యక్తిగత విషయాల పట్ల శ్రుతి మించిన ఆసక్తి వుంటుందనేది కాదనలేని వాస్తవం. మనకా ఎదుటి వ్యక్తి అస్సలు పరిచయం లేకపోయినా, ఆ వ్యక్తి పేరు కూడా మనకు తెలియకపోయినా సరే, ఆ సదరు వ్యక్తి వృత్తి, గత జీవితం పట్ల ఆసక్తి వుంటుంది. ఒకానొక ప్రముఖ దిన పత్రికలో వారం వారం కాలమ్ రాస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించాను.

మరో మాట అవధరించండి...

ఒక ప్రముఖ కవి నన్ను కలవడానికి కర్నూలు వచ్చాడు. ఇంటికి సాదరంగానే ఆహ్వానించాను. అతనికి నేను రాసిన పుస్తకాల్లో ఒకే పుస్తకం తెలుసు. అది కూడా ఏదో పెద్ద మొత్తంలో బహుమతి వచ్చిన పుస్తకం కాబట్టి.

వచ్చి సోఫాలో కూచునీ కూచోగానే అతని మొదటి ప్రశ్న... "మీరింకేం రాసారండీ?"

ఓపిగ్గా సమాధానమిచ్చాను.

"అహాఁ అలాగా చాలా పుస్తకాలే వున్నాయ్. నాకివ్వగలరా?"

మళ్ళీ ఓపిక తెచ్చుకుని ప్రతి పుస్తకం సంతకం చేసి మరీ యిచ్చాను.

కాస్సేపు సాహితీలోకం గురించి చర్చించుకున్న తర్వాత, అతని ప్రశ్న వెంటనే...

"మీరేం చేస్తుంటారు సారూ?"

నేనిబ్బందిగా కదిలి, "ఏమిటి ఏమి చేయడం మాస్టారూ?" అనడిగా.

"అదేమిటలా అడుగుతారు. మీరేం ఉజ్జోగం చేస్తున్నారు?" చీకాగ్గా అడిగాడతను.

నేను మరింత యిబ్బందిగా కదిలి, "ఏమీ ఉద్యోగం చెయ్యనండీ" అన్నాను.

అతను ఆశ్చర్యంగా, "మరెలా?" అనడిగాడు.

"ఎలా ఏమిటి ఎలా?" అన్నాను.

"అది కాదు మాస్టారు; మరి జరగడం ఎలా," అన్నాడు.

"భుక్తికీ గుడ్డకీ యిబ్బంది లేదు. మా అక్కయ్య ఆస్తి రాసిస్తూ ఇరవై లక్షలు ఇల్లిచ్చింది," అన్నాను.

అతను మౌనంగా వుండి పోయాడు. అతని ముఖంలో ఏదో అసంతృప్తి. అతని ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదన్న విషయం ఆయన ముఖంలో దిగంబరంగా కనబడ్డది. అతనికి నా వ్యక్తిగత విషయాల్తో పని లేదన్న సంగతి అతనికీ తెలుసు. నేను రోజూ ఉదయం అతనింటికి భోజనానికి వెళ్ళననీ తెలుసు. అయినా సరే, నా వ్యక్తిగత విషయాలు అతనికి తెలియాలి.

మామూలు మనుషుల పరిస్థితే యిలా వుంటే యిక ప్రముఖులైతే...! ప్రముఖ కళాకారులు, ప్రముఖ రచయితల వ్యక్తిగత జీవితం పట్ల కుతూహలం మరీ ఎక్కువ వుంటుంది. శ్రీశ్రీ తన "అనంతం" ప్రచురిస్తున్నప్పుడు (ధారావాహికగా) ఎంతమంది ఆ రోజుల్లో ఎంత ఆసక్తితో చదివారో చాలామందికి తెలుసు. ఆసక్తితో చదవడం వదిలెయ్యండి. అసలు శ్రీశ్రీ తన వ్యక్తిగత జీవితాన్ని పారదర్శకం చేసాడా అని ప్రశ్నించిన ప్రముఖులు చాలామందున్నారు. అసలు శ్రీశ్రీకే కుతూహలం ఎక్కువన్న సంగతి "అనంతం"లోనే వుంది. అందులో యితర ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్ని ఎంతగా శోధించాడో మనకు తెలుసు.

అసలు శ్రీశ్రీకి వ్యక్తుల వ్యక్తిగత జీవితాల పట్లే కాదు ఆసక్తి; దేశచరిత్రల చీకటి కోణాల పట్లే అనంతమైన ఆసక్తి అన్న విషయం మహాప్రస్థానం చదివితే తెలుస్తుంది.

"ఆ రాణీ ప్రేమ పురాణం
ఆ ముట్టడికైన ఖర్చులూ
కైఫియతుల మతలబులూ
కావేవీ చరిత్ర కర్థం
ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి
కనిపించని కథలన్నీ కావాలిప్పుడు"

-- అని బహిరంగంగా అరిచాడు.

* * *

ఈ నెల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక చదవడానికి కొన్నాను. ముఖచిత్ర కథనాన్ని చూడగానే ఆసక్తిగా పేజీలు తిప్పాను. ఓ ప్రముఖ (ప్రముఖ అనడం తప్పేమో... అంతర్జాతీయ ఖ్యాతి పొందిన) సంగీతకారుడి వైవాహిక జీవితం గురించి, అతని కూతురు అతని కూతురేనా? అన్నది ఆ కథనం. ఆ కథనం చదివింతర్వాత బాధ కలిగింది. కారణం ఆ సంగీతకారుడికీ అతని కూతురికీ ఎక్కడా ఎలాంటి అవమానం జరగలేదు. ఎంతోకాలంగా తన కూతురు అనుకున్న ఆ అమ్మాయి తన కూతురు కాదని తన భార్యకూ ఆ సంగీతకారుడికీ అక్రమంగా జన్మించినదనీ తెల్సిం తర్వాత... అన్నాళ్ళూ ఆ సదరు అమ్మాయి తండ్రిగా చలామణి అయిన వ్యక్తికి ఎంత ఖేదం కలిగి వుంటుందో అని తెల్సింతర్వాత బాధ కలిగింది.

* * *

ఈ విశాల ప్రపంచంలో మనకు ఉపయోగపడేవి, మన సాటి మనుషులకుపయోగపడేవి అయిన విషయాలు కోకొల్లలుగా వున్నాయి. జ్ఞానం అపారమైంది. అనంతమైంది. మనం అనవసర విషయాలను వదిలేసి... ఉపయోగపడే విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటే బావుంటుందేమో...

నిజానికి మనకు సన్నిహితులైన వారి పట్ల కూడా మనం ఈ అనవసర వ్యక్తిగత విషయాసక్తిని వదిలేయాలి. ఈ ప్రపంచం జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఎప్పుడూ సిద్ధంగానే వుంది, వుంటుంది.

(ఈ వ్యాసం "ఇంద్ర ధనుస్సు" శీర్షికన "విపుల" పత్రిక డిసెంబరు 2005 సంచికలో ప్రచురితమైంది.)

Tuesday, June 30, 2009

కళకలలు

ఈ మధ్యన దవిన్చీ పెయింటింగ్ యింకోటి బయటపడ్డది... దవిన్చీని యిన్చి యిన్చీ కొల్చి ఒక్కో సెంటీమీటరుకో కోటో ఎంతో లెక్కలు కట్టారు ఆర్టు లవర్లు.

కానీ ఆ చిత్ర పరిశ్రమ (నిజంగా శ్రమేనండోయ్) వెనక ఆ కళాకారుడి వేదన, యాతన ఎంత? దాన్ని దాచుకున్న కళాప్రేమికుడి కళారాధన విలువ ఎంత? అని కొలిచే సాధనా లేవీ రోజుల్లో, ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడానూ.

విన్సెంట్ వ్యాంగో అనే చిత్రకారుడు బతికినంతకాలం దుర్భరమైన దారిద్ర్యంతో బతికాడు. వందలకొద్దీ చిత్రాలు వేశాడు. కేన్వాసులూ, రంగులూ, కుంచెలూ కొన్డానికి వేశ్యలకి చిన్న చిన్న చిత్రాలు వేసి అమ్మి డబ్బు సమకూర్చుకునేవాడు. కానీ బతికున్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి పెద్ద చిత్రాన్ని అమ్ముకోలేకపోయాడు. అతను దారిద్ర్యంతో, మతి చాంచల్యంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ రోజున అతని చిత్రం ఒక్కొక్కటి కొన్ని కోట్ల రూపాయలు పలుకుతుంది. ఈ రోజున కూడా ఎక్కడో ఎమ్. ఎఫ్. హుస్సేన్ లాంటి వాళ్ళు లక్షలాది రూపాయలకు వాళ్ళ చిత్రాలను అమ్ముకొంటున్నారు.

* * *

కళాకారుల్లో చిత్రకారులూ, నర్తకులూ, గాయకులూ, శిల్పులూ వస్తారుగానీ అదేం ఖర్మో కవులూ, రచయితలూ రారు. రాజుల పోషణలో వెనకటితరం కవులు ధనవంతులుగానే బతికుంటారు (ఎక్కడో పోతన లాంటి వాళ్ళు తప్ప). ఈ తరం రచయితల్లో ఎంతమంది కవులూ రచయితలూ వాళ్ళ వాళ్ళ సాహిత్యానికి సరైన విలువ పొందగలుగుతున్నారు. (సినిమా రచయితల్నీ కవుల్నీ యిక్కడ మినహాయించాలి.) రచనలకందే పారితోషికాలంటారా? అవీ అంతంత మాత్రమే. అలాంటప్పుడు రచయితన్నవాడిక్కూడా రాయ మనస్కరించదు.

ఇక్కడో మాట చెప్పుకోవాలి. ఓ మలయాళీ రచయిత ఓ పుస్తకం అచ్చువేస్తే అయిదు వేల కాపీలు అచ్చు వేస్తాడుట. ఇక్కడ మనం వెయ్యి కాపీలు అచ్చు వేసుకుని అటకల మీద కట్టలు కట్టి ఏ ఆర్నెల్లకో దుమ్ము దులుపుకుని ఎలుకలకి నైవేద్యమైన వాటిని వేరు చేసుకుని మన జీవిత కాలం అమ్ముకుంటూనే వుంటాం.
కొన్ని పుస్తకాలీ మధ్య అమ్ముడవుతున్నాయి. అది సృజనాత్మక సాహిత్యం కాదు. వికాసాలూ, నిచ్చెన్లూ, పైకెగబాకడాలూ, ఆకాశాన్నందుకోవడాలూ... యివీ.

* * *

రచనల విషయం వచ్చింది కాబట్టి యిక్కడ ఓ ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావించాలి. ఒకాయన పేరు శ్రీరాగి (కోసల్లి పూర్ణ చంద్ర సదాశివ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు). ఇంకొకాయన వియోగి (విజయప్రసాద్), పై చెప్పిన శ్రీరాగి గారి కుమారుడు. ఈయనకు బి.ఎస్సీతో పాటు అయిదు (అక్షరాలా అయిదు) ఎమ్మే డిగ్రీలున్నాయి. శ్రీరాగి గారు ప్రభుత్వాధికారిగా రిటైరయ్యారు. వియోగి ఎల్.ఐ.సి ఏజెంట్స్ కాలేజ్ ప్రిన్సిపాలుగా వున్నారు.

వీళ్ళిద్దరూ అవిశ్రాంతంగా రాస్తూనే వుంటారు. యిద్దరూ 150 పైచిలుకు కథలు రాసి వివిధ పత్రికల్లో ప్రచురించారు. శ్రీరాగి గారి ఇంగ్లీషు అనువాద కథలు ఎన్నో యిదే పత్రికలో ప్రచురితమయ్యాయి. పుస్తకాలు అచ్చువేపించి యిస్తామంటూ సాహితీ సేవకుల వేషాలు వేసుకున్న బ్రోకర్లు కొల్లలుగా వున్న దేశం కదా మన్ది. తండ్రీకొడుకులిద్దరూ ఈ బ్రోకర్ల బారిన పడి ఓ లక్ష రూపాయలు నున్నగా రాల్చుకున్నారు.

వీళ్ళిద్దరూ మహాద్భుతమైన సాహితీ సృజనకారులని అనలేను కానీ, వీళ్ళిద్దరికీ వున్న సాహితీ నిబద్ధత మాత్రం చాలా గొప్పది అన్చెప్పగలను. వీళ్ళు అసలైన కళాకారులనిపిస్తుంది.

* * *

కళాకారుడు ఏ రూపంలోనైనా వుండొచ్చు. శిల్పి, చిత్రకారుడు, గాయకుడు, నర్తకుడు, కవి, వక్త వీళ్ళందరి మీదా వీళ్ళందరికంటే అద్భుతమైన కళాకారులు మన ముందుంటారు.

మంచి శ్రోతలు. వీళ్ళు బహు తక్కువగా వుండి అరుదుగా కనిపిస్తుంటారు.

* * *

మా కర్నూలు-నంద్యాల రోడ్డు మీదికి ఒక హోటేలుంది. చిన్నదే. అందులో ఓ ఇరవై ఇరవైఅయిదు సంవత్సరాల కుర్రాడు పన్జేస్తాడు. వాడి పని కూరగాయలు తరగడం.

వాడు ఉల్లిపాయలు తరుగుతాడండీ! అసలు ఉల్లిపాయలవేపు చూడడు. వాడి వేళ్ళూ కత్తే చూస్తుంటాయి. ఆ కత్తి కూడా సగం అరిగిపోయి మాసిన పాత చిరుగుగుడ్డ చుట్టబడిన హ్యాండిల్ కలిగుంటుంది. వాడు ఉల్లిపాయలు తరిగే చెక్కముక్కను కూడా హొటేలు కష్టమర్లు ఎప్పుడో సగానికి పైగా తినేసారు. నల్లగా బక్కపల్చగా ఉండి జెట్ స్పీడ్‌‍తో ఉల్లిపాయలు తరిగే వాడి నైపుణ్యం నా మటుకు నాకు ఓ అద్భుతమైన కళే అనిపిస్తుంది సుమండీ.

* * *

జనార్థన మహర్షి తన "వెన్న ముద్దలు" పుస్తకం వెనక యిలా రాసుకున్నాడు:

"నాకు చాలాసార్లు ఓ కల వస్తుంటుంది. చాలా అందమయిన కల. అందులో కవి ఒకడు తన కవిత్వం ద్వారా సంపాదించిన డబ్బుతో కారులో తిరుగుతూంటాడు. కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చుంటాడు. ఆ కవిత్వం పదే పదే ముద్రింపబడి ఆ కవి మనవళ్ళు రాయల్టీ రూపంలో లక్షలు పొందుతుంటారు. అతని గొప్ప కవితాపదాలు యింటింటా గాయత్రీ మంత్రమవుతుంది.

అప్పుడు కవి తన డబ్బుతో తన కవిత్వం ప్రింట్ చేసుకోనక్కర్లేదు. అప్పు చేసి, ఆస్తులమ్మి కవితా సంకలనాన్ని పుస్తకాల షాపులో దుమ్ము పట్టించుకోనక్కర్లేదు."

మహర్షీ! మీ కల నిజమవ్వాలని నేను కోరుకోవడం కూడా కలేనా?

(ఈ వ్యాసం "ఇంద్ర ధనుస్సు" శీర్షికన "విపుల" పత్రిక నవంబరు 2005 సంచికలో ప్రచురితమైంది.)

Monday, June 29, 2009

వైయక్తిక యుద్ధాలు

కూలివాడి దగ్గర్నించీ కోటీశ్వరుడి వరకూ జీవితం ఓ యుద్ధం. కొందరికి మాత్రం పరోక్ష యుద్ధమే అయినా, చాలామందికి ప్రత్యక్ష యుద్ధమే.

రోజుకో యుద్ధనీతి...
రోజుకో యుద్ధరీతి...

ఉదయం నిద్ర మేల్కొన్న క్షణం నించి రణన్నినాదాలే వినబడ్తుంటాయి. శరీరంలో ప్రతి అవయవమూ యుద్ధ ఘంటారావంతో మేల్కొంటుంది. అసలు సగటు మనిషి మేలుకోవడం మేలుకోవడమే యుద్ధగీతి నాలపిస్తూ (ఆవలింతతోపాటు) మేల్కొంటాడు.

రాత్రి పక్క మీదికి చేరుకోగానే మరుసటి దిన రణతంత్రపుటాలోచన్లు మేధను కమ్ముకుంటాయి. ఉదయం లేవగానే ఎవరు ఎవరి మీద దండెత్తాలి? ఎవరు దేన్తోటి యుద్ధం చేయాలి? దేనికోసం పోరాడాలి? పోరాడితే ఎలా పోరాడాలి? పోయిన్ది మళ్ళీ ఎలా సంపాదించాలి? పక్కవాడి శాంతిని (ఉంటే) ఎలా నాశనం చేయాలి? మనకున్న అశాంతిని (ఉండేదదే కాబట్టి) ఎలా పెంచుకోవాలి? ఇలా యుద్ధతంత్రపుటాలోచన్లు...

సర్సరేనయ్యా, ఇవన్నీ సామాన్య మానవులకి, నైమిత్తికాలకోసం దేవులాడే జన బాహుళ్యానికే... ఇటువంటి నీచ నికృష్ట భౌతిక స్వార్థ యుద్ధాల కతీతమైన "మగానుభావులు" ఉన్నారు... వాళ్ళ మాటేమిటీ అంటారా?

తెల్సండీ... సాములోర్లూ సన్నాసులూ కాషాయిధారులూ గెడ్డాలోళ్ళూ వాళ్ళందర్కీ ఈ యుద్ధాలూ గట్రా ఉండవనే దురభి (సారీ) అభిప్రాయం మీకుందేమో.

వాళ్ళూ తిళ్ళు తినాలి. వాళ్ళూ మనుగడ సాగించాలి. వాళ్ళూ హాయిగా నిద్దరోవాలి. వాళ్ళ వాళ్ళ సామ్రాజ్యాలు (మఠాలూ, పీఠాలు, ఆశ్రయాలూ వగైరా వగైరాలు) వాళ్ళు కాపాడుకోవాలి. కాదంటారా? "లేదు" అని మీరంటే మీకంటే పసిపిల్లలు ఉండరు (అంటే మీరు దేవుళ్ళతో సమానమన్మాట). వాళ్ళ వాళ్ళ యుద్ధాలు వాళ్ళకుంటాయండీ.

ఓ గుడి ప్రాంగణం పడగొట్టి కొత్తది కట్టాలంటే మా శాస్త్రం ప్రామాణికం అంటే; కాదు, కానే కాదు మా శాస్త్రం ప్రామాణికం అంటూ... ఓ సాములోరు "నిలువు" అంటే ఇంకో సాములోరు "అడ్డం" అనీ... కొండొకచో మన పురుచ్చితలైవి జయలలితాంబ వారి మీద పరోక్ష యుద్ధాలు చేసేసి ప్రత్యక్ష నరకాలైన జైలుకు వెళ్ళడాలూ... ఇట్లా వాళ్ళు కూడా ఉదయం లేవగానే యుద్ధానికి సన్నద్ధం కావాల్సిందేనండీ.

ఇక ఇవి కాక, ఆముష్మిక యుద్ధాలు, ఆధ్యాత్మిక యుద్ధాలు, ఆత్మానుగత యుద్ధాలు, నిర్వికల్ప నిరామయ సమాధి స్థితి కోసం చేసే యుద్ధాలు....

సకల జీవరాసులకీ, అచర జగత్తుక్కూడానండీ (వీటికి మనిషితో యుద్ధం) యుద్ధం అనివార్యం.

Struggle for Existence అనీ
Survival of the Fittest అనీ ఇంగిలీషులో, యుద్ధం అనివార్యం.

"యుద్ధరాహిత్యమన్నది అస్సలుండదా" అనడుగుతారా.... ఉంటుందండీ... అయితే యాక్షన్ సీన్లు ఉండవు. ఛేజింగులుండవు. బాంబులూ, కత్తులూ, కరాటేలు వుండవు. "నో డిషుం డిషుం..."

అంటే నీ బతుకు నువ్వు బతికి నా బతుకు నన్ను బతికి ఛావనీ అన్న రిటైర్మంటన్నమాట. దాన్నే ఇంగిలీషులో symbiosis అంటారు. (ఇంగ్లిష్లో ఏడిస్తే దానికో సాధికారత ఏడిచి చస్తుందిగా, అందుకని ఇంగిలీషు మాట అన్మాట.)

మన మన చిన్న లోకాల పరిధుల్లోని వ్యక్తుల్నీ వాళ్ళు చేసే యుద్ధాల్నే పరిశీలించండి బాగా దగ్గర్నుంచీ... వాళ్ళ జీవిత యుద్ధాల్నించీ మనం చాలా చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. (అది నువ్వు కొత్తగా చెప్పేదేముందివాయ్, అంటారా? ఓ మంచి పాఠాన్ని ఎవరైనా ఎన్నిసార్లయినా చదవొచ్చూ చెప్పొచ్చూ కదండీ.)

* * *

"ఎవరో వస్తారని ఏమో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదురపోకుమా"

అని ఓ సినీ కవి హెచ్చరించి, ఒరేయ్ మామూలు మనిషీ! ఈ యుద్ధం నీది, నీ యుద్ధం నువ్వే చేయాలి. లే పోరాడు, పోరాటం లేకపోతే బతుకుబండి సాగదు అన్చెప్పాడు.

అదే విషయం మన గీత కూడా చెప్పింది.

ఏ గీతా? మీ పక్కింటమ్మాయి పొడవాటి చెవి లోలాకులూ, పొట్టి జుత్తూ, ప్యాంటూ షర్టూ వేసుకుని ఎమ్మే ఇంగిలీషు చదివి ఎలిమెంటరీ స్కూల్లో తెలుగు పాఠాలు చెబుతుందే ఆ పిల్లా? అనడక్కండి. ఆ గీత కాదు. భగవద్గీతండీ (అబ్బో వీడు మళ్ళీ యింకో సంస్కృత శ్లోకంతో కొట్టి మన్నేడిపించేస్తాడ్రా బాబో అనుకుంటున్నారా? కరెక్టే ఏడవండి).

ఆత్మ సంయమ యోగంలో ఈ శ్లోకం చూడండి:

"ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యోత్మనో బన్ధురాత్మైవ రిఫరాత్మవః"

అంటే, "నాయనా! నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నిన్ను నువ్వు అధోగతి పాల్చేసుకోకూ, నీకు నీవే బంధువ్వి, నీకు నీవే శత్రువు కూడానూ తెలిసిందా" అని. అంటే శాస్త్రాలూ, దేముళ్ళూ, సాములోళ్ళూ, గురూ గార్లూ ఎందరున్నా... చూపుడు వేల్తో అదో అదే నీ దారి అన్చూపుతారే తప్ప నిన్ను మోసుకెళ్ళరు. ఆ దారెంబడ నడిచి ఛావాల్సింది నువ్వే అని కదా! సో... అందువలన... ఇస్లియే... కాబట్టి మన మన జీవిత యుద్ధాలు మనమే చేసుకొనవలెను.

* * *

సమష్టి యుద్ధాలుండవా అనడగొచ్చు మీరు. ఉంటాయి, ఉండితీరతాయి. అవే చరిత్రలు... అవే నాగరికతల మలుపులు. వాటి గురించి చిన్న వ్యాసాలు చాలవు. పెద్ద దొడ్డు పుస్తకాలు రాయాలి. కాబట్టి వైయక్తిక యుద్ధాలకే ఈ చిన్న వ్యాసం పరిమితం.

* * *

ఆ అమ్మాయి పేరు రాజేశ్వరి. వయస్సు సరిగ్గా ఇరవైరెండేళ్ళు. సన్నగా, పీలగా, నల్లగా గుంటలు పడ్డ కళ్ళతో చూట్టానికి పదిహేను పదారేళ్ళ అమ్మాయిలా ఉంటుంది. ఆ అమ్మాయి తల్లి రాములమ్మ. టైలరు. మా అక్కయ్యా వాళ్ళ రవికెలూ అవీ కుడుతూంటుంది. ఓ నాలుగైదు కుట్టుమిషన్లు పెట్టుకుని టైలరింగు నేర్పుతుంటుంది. (రాములమ్మ యుద్ధం గురించి రాయట్లేదు నేను. ఆమె కూతురు రాజేశ్వరి యుద్ధం గురించి కదా.) రాజేశ్వరికి పదో తరగతి అవంగానే పదహారో ఏట పెళ్ళి చేశారు తల్లీదండ్రీ. (వాళ్ళ అవిద్య, అజ్ఞానం, మౌడ్యం అవి అప్రస్తుతాలు). రాజేశ్వరి పదిహేడో ఏట తల్లైంది.... మగబిడ్డ... పండులాగానో పువ్వులాగానో చిదిమి దీపం పెట్టుకునేట్టుగానో లేడు... ఎదిగీ ఎదగని ఆ పిల్ల శరీరాన్ని చీల్చుకు పుట్టినవాడు... వాడు. ఏ విధమైన ఎదుగుదలా లేకుండా ఈ భూమ్మీద పడ్డాడు.

రాజేశ్వరి భర్త దగ్గర్నుంచీ అత్తమామలూ ఆడపడుచులూ చుట్టు పక్కలవాళ్ళూ అందరూ వాణ్ణి అసహ్యించుకోడం... ఏవగింపుగా చూడ్డం... ఓ సంవత్సరం ఆరునెల్లు గడిచాయి... పిల్లవాడికి మెడ నిలవదు... చూపు నిలవదు... అనాకారి... మెట్టినింటి వారి అసహ్యం వాడివేపు ఎంతకు పెరిగిందంటే... వింటే వళ్ళు జలదరిస్తుంది, కంపరమెత్తుతుంది. మనిషి ఏమైపోయాడని అనిపిస్తుంది.

ఇలాంటి పిల్లాడు పిల్లాడేనా... వదిలించుకుందాం... కాలువలో పారేద్దాం... కంప చెట్లలో విసిరేద్దాం... గొంతులో కింత ఏమైనా వేసేద్దాం... అనడం నించీ... ఓ కాళరాత్రి ఆ ప్రయత్నం చేయడం వరకూ వచ్చింది. అది రాజేశ్వరి కళ్ళపడింది. కేకలేసింది. గోల చేసింది. ఆ పసికందు నెత్తుకొని గుండెలక్కరుచుకుని ఆ నడిరాత్రి పరిగెత్తి పరిగెత్తి బస్టాండు చేరుకుని బస్సెక్కి తల్లి దగ్గరికొచ్చేసింది. తల్లీ అన్నయ్యా ఆదరించి ఓదార్చారు. కడుపులో దాచుకున్నారు.

ఓటు హక్కు కూడా లేని రాజేశ్వరి అనే ఆ పసితల్లి, తన మాతృత్వపు హక్కు కోసం యుద్ధం మొదలుపెట్టింది. భర్తను కాదు పొమ్మంది. తల్లినించి నేర్చుకున్న కుట్టుపనిని నమ్ముకుంది. జీవితమ్మీదా, తన మీద తిరగబడ్డ ప్రకృతి మీదా, భర్త మీదా, తన కడుపున పుట్టిన వాడి వైకల్యమ్మీదా యుద్ధాన్ని ప్రకటించింది. అది అవిశ్రాంత యుద్ధమని ఆ పిల్లకు తెలుసు.

ఈ వ్యాసం రాస్తూన్న సమయానికి కుట్టిన రవికెలు తీసుకుని ఇంటికి వచ్చింది. కొడుక్కి ఏడేళ్ళు వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఒక్కో అడుగూ వేస్తున్నాడు. మెడా, చూపూ నిలబెడుతున్నాడు. మనుషుల్ని, ముఖ్యంగా వాళ్ళమ్మని గుర్తుపడుతున్నాడు. ఈ విషయాల్ని ఆనందంగా చెప్పిందా అమ్మాయి.

బాబుకేం పేరు పెట్టావు తల్లీ అనడిగితే "శశాంక్" అని గర్వంగా చెప్పింది. నిజమే కదా! ఆద్యంతాలు లేని అమ్మ మనస్సాకాశంలో ఏ బిడ్డైనా చంద్రుడే కదా! బక్కపల్చగా కనబడే రాజేశ్వరిని చూస్తుంటే, ఆమె చేస్తున్న యుద్ధం చూస్తుంటే, ఎంతటి యోధ ఈ పిల్ల! అనిపించింది.

* * *

"జీవితం బుద్బుద ప్రాయమే అయినా
రెండు విషయాలు మాత్రం పాషాణ సదృశాలు
ఒకటి - ఒకరి నిర్వేదంలో దుఃఖంలో నువ్వు చూపే దయార్ద్రత
రెండు -నీ స్వంత కష్టాల్లో నువ్వు ప్రదర్శించే ధైర్యసాహసాలు"

-- ఆడమ్ లిండ్సే గార్డన్

మనల్ని మనం జయించుకున్న తర్వాత
యుద్ధభీతి ఖచ్చితంగా నశించిపోతుంది.

-- కాశీభట్ల వేణుగోపాల్

(ఈ వ్యాసం "ఇంద్ర ధనుస్సు" శీర్షికన "విపుల" పత్రిక అక్టోబరు 2005 సంచికలో ప్రచురితమైంది.)

Sunday, June 28, 2009

బహు భయంకర మే"తా"వులు

బొద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః
అబోధోసహతాశ్చాన్యే జీర్ణ మంగే సుభాషితః

-- అంటాడు భర్తృహరి.

ఏదేనా రాయమని ఈ పత్రిక వారు అడిగారు.... నిజమే ఏమైనా చెప్పాలని ఉంటే నాలాంటి రచయితలకు అక్షరం సరైన మాధ్యమం... బాగానే వుంది కానీ ఏమిటి చెప్పడం?

పై శ్లోకంలో చెప్పినట్టు తెలిసిన వారూ, ప్రభువులూ వినే స్థితిలో లేరు. సామాన్యులకా వినే తెలివి లేదు (అవసరం అస్సలు లేదు). అందుకే చెప్పాలీ అనిపించిందేదైనా ఉంటే గింటే, లోపలికి దిగమింగుకోవడం అలవాటైపోయింది. అదుగో సరిగ్గా అట్లా ఉన్నప్పుడు ఈ పత్రికవారు ఫోను చేసి పర్వాలేదు ఏదో రాయండి, అదీ నెలకో మాటే గదా పాఠకులు భరిస్తార్లెండి అన్నారు.... ఆనందం!

ఆనందం అని అనేశాను గానండీ... భయం దాన్ని మింగేస్తూంది. భయం దేనికంటారా? నా అజ్ఞానానికీ, నా లోపల కురచదనానికీ, నా అసమర్థతకీ నేనే భయపడే రోజులు పోయాయి (తెలుగు రచయితను గదా!). ఇప్పుడు నా భయమల్లా "విమర్శకులు" అన్న వేషం వేసుకున్న మే"తా"వుల గురించి, వల్లానూ.

ముఖ్యంగా మన తెలుగు సాహితీ విమర్శకుడు బహు భయంకరుడు (కొందరు ఇందుకు మినహాయింపు; కొందరంటే బహు కొందరని).

వీళ్ళు పైన భర్తృహరి చెప్పిన మూడు వర్గాల్లో ఏ కోవకీ చెందరు. వీళ్ళది ఓ ప్రత్యేక జాతి.
ప్రభువులా?... కాదు.

బాగా తెలిసినవారా?... కానే కాదు.

అసలు తెలీనివాళ్ళా?... వుహూఁ

వీళ్ళు సందర్భానుసారం సంకలన కర్తలుగానూ, సంపాద(త)కులుగానూ కవులుగానూ, కథకులుగానూ, మీ"టింగు"ల్లో (అధిక) ప్రసంగికులుగానూ ఒకటేమిటీ రచనా ప్రక్రియ అన్నదానికి సంబంధించిన అన్ని విషయాల్లో, అన్ని రకాల కార్యక్రమాల్లో రకరకాలుగా వేషాలు మార్చగల కళాభినివేశంవున్నవాళ్ళు.

వీళ్ళ గురించండీ నా భయమంతానూ.

వీళ్ళు తమని తాము watch dogs అన్చెప్పుకుంటూ సాహిత్యాన్ని కాపలా కాస్తున్నాం అంటూంటారు.

వీళ్ళు వీర భయంకర భాషాభిమానులుగా కాననయ్యెదరు. ఎందుకో తెలుసాండీ? వీళ్ళకి తెలిసింది ఒక భాషే గనుక. (ఆంధ్ర భాషా! ఆనందించుము.) వీళ్ళు పరభాషా సాహిత్యం కూడా చదువుతారు... ఎట్లా? దాన్నెవరన్నా తెలుగు చేస్తే (అసలు తెలుగు చేయబడ్డ పరభాషా సాహిత్యం ఎంత ఉందో అందరికీ తెలుసు).

వీళ్ళకి "కాఫ్కా", "నబొకొవ్"లు తెలియరు (వీళ్ళని తెలుగు చేయగల దిట్టలు ఇంకా రాలేదు). ఒకవేళ వాళ్ళ పేర్లు తెలిసినా చాలు వాళ్ళ సాహిత్యం మొత్తాన్నీ బేరీజు వేయగల్రు. ఎలాగంటే వీళ్ళు అలాంటి తుంటరి రచయితల గురించిన వ్యాసాలు (తెలుగులో) చదివుంటారు. అవి చదివేసి వారి వారి సాహిత్యాన్ని తక్కట్లో పారేసి తూకం వేసి పారేసి దాని "రేటు" ఎంతో ఏమిటో చెప్పేయగల్రు, చెప్పేస్తారు.

ఇక్కడ ఓ విషయం ప్రస్తావిస్తాను. వివాదాస్పదుడిగా పేరుబడ్డ రచయిత "రష్దీ". అతని పుస్తకం "సటానిక్ వర్సెస్" మన దేశంలో ప్రత్యక్షమయిన వెంటనే ఆ పుస్తకాన్ని ఇస్లామిక్ దేశాలు నిషేదించాయి. ఇస్లాం వ్యతిరేకంగా చెప్పబడ్తూ రష్దీ మీద మరణదండన "ఫత్వా" జారీ చేయబడ్డది. వెనువెంటనే, మన్ది మరీ సెక్యులర్ దేశం కదా (అందునా అప్పటికే రష్దీ పుస్తకం "మిడ్‌‍నైట్స్ చిల్డ్రన్" ఇందిరాగాంధీ కినుకకు కారణమయి ఉండింది కూడానూ), మన్దేశంలో కూడానూ "సటానిక్ వర్సెస్" నిషేదానికి గురైంది. ఇంకేం ఆ పుస్తకాలు నల్లబజార్లో విపరీతమయిన ధరకు అమ్ముడయ్యాయి. అది ఫక్తు వ్యాపార సంబంధ విషయం. మన సాహిత్య గొడవలుగానీ, మత ప్రసక్తి గానీ నల్లబజారుకు అడ్డు రాలేదు.

ఆ సందర్భంలో ఒక ముస్లిం రాజకీయ నాయకుడు ఆ పుస్తకాన్ని తీవ్రంగా తెగనాడారు. అప్పుడాయనకూ ఓ పత్రికా ప్రతినిధికీ మధ్య జరిగిన సంభాషణ యిలా వుంది.

పత్రిక: "అయ్యా! సటానిక్ వర్సెస్ పుస్తకాన్ని ఎందుకని నిషేదించాలనుకుంటున్నారు?"

రా.నా.: "అది ఇస్లాం వ్యతిరేక భావాలు కలిగివుంది. దాన్నిండా blasphemy (దైవ దూషణ) ఉన్నది."

పత్రిక: "మీకెట్లా తెలుసా సంగతి? మీరు ఆ పుస్తకాన్ని చదివారా?"

రా.నా.: "భలేవారే! నేను ఇస్లాం విశ్వాసిని. దాన్ని వ్యతిరేకించే భావాలు గల పుస్తకాన్ని ఎలా చదువుతాను? మీరైనా నన్నెలా చదవమంటారు?"

పత్రిక: ???

పై సంభాషణలోని రాజకీయ నాయకుడికీ మన విమర్శక శిఖామణులకీ పెద్ద వ్యత్యాసం లేదు. వీళ్ళు చదవకుండా ఏ పుస్తకం పైనైనా ఎడా పెడా వాయించేయగల్రు. ఈ మహానుభావుల మేధ ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికో చిన్న ఉదాహరణ. ఓ మీటింగులో సదరు విమర్శకాగ్రేసర్ భుక్తాయాసం తీర్చుకుంటున్నారు. (వారేం తిన్నారో చెప్పనవసరం లేదు గదా!) నా మిత్రుడొకడు పరమకంత్రి. ఓ ప్రముఖ దినపత్రికలోని ఓ వార్తని ముక్కల కింద విడగొట్టి ఓ రెండు ఠావులు నిలువునా నింపి పట్టుకెళ్ళి ఆ మహాశయులకు చూపించాడు. దాన్ని నిశితంగా (?) పరిశీలించిన ఆ గొప్ప మేధావి "ఆహాఁ చాలా మంచి కవిత వ్రాసారండీ. ఫలానా పత్రిక ఆదివారం అనుబంధానికి ఫోన్చేసి చెప్తాను" అని సెలవిచ్చారు.

ఆ ఫలానా పత్రికలోదే ఆ వార్త.

అదండీ సంగతి! ఇలాంటి వాళ్ళకి భయపడకుండా నాలాంటి అల్పజీవి ఎలా ఉండగలడండీ. అందుకే రాయమని అనగానే ఆనందం పలచబడ్డది.

* * *

చదవడం రానివాడు ఎంత అల్పజీవో, చదవడం తెలిసీ చదవనివాడు అంతకు ఎన్నో రెట్లు అల్పుడు.

[ఈ వ్యాసం "ఇంద్ర ధనుస్సు" శీర్షికన "విపుల" పత్రిక సెప్టెంబరు 2005 సంచికలో ప్రచురితమైంది. ]